- బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్


నేటి సాక్షి, మందమర్రి:- రోడ్డు నిబంధనలు పాటిస్తూ, ప్రమాదాలు అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ తెలిపారు. 54వ జాతీయ భద్రత వారోత్సవాలు-2025 ను పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని టోల్ గేట్ వద్ద జాతీయ రహదారి అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఏసిపి ఏ రవికుమార్ మాట్లాడుతూ, 54వ జాతీయ భద్రత వారోత్సవాల ప్రాముఖ్యతను తెలియజేశారు. భద్రతపై అవగాహన పెంచడానికి, ప్రమాదాలను తగ్గించడానికి 1971లో నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్సి) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ప్రతి సంవత్సరం మార్చి 4న జాతీయ భద్రత దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. పోలీసుల ఆద్వర్యంలో రహదారి భద్రత గురించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన గత సంవత్సరం బెల్లంపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గల జాతీయ రహదారి 363 మీద జరిగిన రోడ్డు ప్రమాదాలలో 54 మంది మరణించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో రహదారులపై వాహన నిలిపి ఉంచడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉందని తెలిపారు. వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని, సంబంధిత అధికారులతో కలిసి ప్రమాదల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సిఐ కే శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్, కాసీపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్, జాతీయ రహదారి నిర్వహణ అధికారి సునీల్, సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.




