నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా ప్రతినిధి, భక్త కుమార్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజావ్యతిరేక ప్రతిపాదనలను ప్రజలు తిరస్కరించాలని వామపక్ష పార్టీలు కోరాయి. అఖిల భారత వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ఈ నెల 14 నుంచి 20 వరకూ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. జిల్లా కేంద్రంలో జరుగు ధర్నాలు, నిరసనలు, ప్రదర్శనలు, రౌండ్టేబుల్ సమావేశాలు జరిపి నిరసన తెలపాలని కోరాయి. ఈ మేరకు ఆదివారం సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు, సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్. నరసింహులు, సిపిఐ (ఎంఎల్ )లిబరేషన్ అన్నమయ్య జిల్లా నాయకులు నాయకులు మావులూరి విశ్వనాథ్ లు ఉమ్మడిగా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల్లో కొనుగోలు శక్తి కుచించుకు పోయినందున ఆర్థిక వ్యవస్థలో తగ్గిన డిమాండ్ సమస్యను పరిష్కరించడానికి బదులు అందుకు విరుద్ధంగా మోడీ ప్రభుత్వం సంపన్నులకు రాయితీలు ఇస్తోందని పేర్కొన్నారు. ఖర్చుల్లో కోత పెట్టడం గర్హనీయమని, నిరుద్యోగ సమస్యను ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని తెలిపారు. ఆహార సబ్సిడీలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సంక్షేమంపై పెట్టిన ఖర్చు గతేడాది కంటే బాగా తగ్గిపోయిందన్నారు. అవసరం ఉన్నప్పటికీ ఉపాధిహామీ పథకానికి నిధులు అదనంగా కేటాయించలేదని, ధరల పెరుగుదల, జిఎస్టి పెంపుదలతో అనేక ఇబ్బందులు పడుతున్న కార్మికవర్గాన్ని ఈ బడ్జెట్ విస్మరించిందని పేర్కొన్నారు. ప్రజావ్యతిరేక బడ్జెట్పై ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయని వివరించారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయిస్తూ చట్టబద్ధమైన హామీ కల్పించాలని, వ్యవసాయ మార్కెటింగ్పై జాతీయ విధాన ముసాయిదాను ఉపసంహరించాలని కోరాయి. నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ ద్వారా చేపట్టే ప్రభుత్వరంగ ప్రైవేటీకరణ చర్యలను, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటురంగానికి బదలాయించడాన్ని ఆపాలని, బీమా రంగంలో వందశాతం ఎఫ్డిఐలను ఉపసంహరించాలని కోరాయి. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులను 50 శాతం పెంచాలని డిమాండ్ చేశాయి. పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రవేశపెట్టాలని, వృద్ధాప్య పెన్షన్లు, ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాల కోసం కేంద్ర కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశాయి. ఆరోగ్య రంగ కేటాయింపులను జిడిపిలో మూడు శాతానికి, విద్యా రంగానికి ఆరు శాతానికి కేటాయింపులు పెంచాలని కోరాయి. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆహార సబ్సిడీని పెంచాలని, ఎస్సి, ఎస్టి సంక్షేమానికి, మహిళా శిశు సంక్షేమానికి, ఐసి.డిఎస్కు కేటాయింపులు, స్కీమ్ వర్కర్లకు ఇచ్చే గౌరవ వేతనాల్లో కేంద్ర వాటాను, రాష్ట్రాలకు నిధుల బదిలీని, కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు పెంచాలని కోరాయి. రాష్ట్రాలతో పంచుకునే విభాగంలో చేర్చని పెట్రోలియం ఉత్పత్తులపై సెస్సులను సర్ ఛార్జీలను రద్దు చేయాలని కోరారు





