- జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ బి.వి.ఎస్.ఎన్.రాజు
నేటి సాక్షి, పలాస కాశీబుగ్గ, రమేష్ కుమార్ పాత్రో: ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ బి.వి.ఎస్.ఎన్.రాజు అధికారులకు సూచించారు. మంగళవారం బూర్జ మండలం ఓ.వి.పేట గ్రామంలో స్థానిక సర్పంచ్ మెట్ట అమ్మాజమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో భాగంగా నెలకొన్న భూవివాదాలు రెవెన్యూ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ మాదిరిగానే ఉన్నాయని అన్నారు. ఈ రెవెన్యూ సదస్సుకు మండల స్థాయి అధికారులు హాజరు కాకపోవడంతో సమస్యలు సమస్యలుగానే మిగులుతాయి అన్నారు. నవంబర్ నెలలో గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో స్వయంగా మండల తాసిల్దార్ కు ఇచ్చిన ఫిర్యాదులు యిప్పటి వరకు పరిష్కారానికి నోచుకోలేదని, ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా స్థానిక వైస్. ఎంపీపీ బుడుమూరు సూర్యారావు మాట్లాడుతూ తక్షణ పరిష్కారం చేయగలిగిన సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో తొగరం నీటి సంఘం ఉపాధ్యక్షులు బుడుమూరు శ్రీరామమూర్తి మాట్లాడుతూ అధికారులు తగు చర్యలు చేపట్టి రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఓ.వి.పేట గ్రామపంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు బుడుమూరు సత్యనారాయణ మాట్లాడుతూ సమస్యలు సమస్యలుగానే నిలిచిపోవడంతో జటిలమవుతున్నాయని, వివాదాలు పెరుగుతున్నాయని అందుకు ఆస్కారం లేకుండా సమస్యలు పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కోరారు.





