నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఒక తిరుచ్చిలో శ్రీ మలయప్ప స్వామి, మరో తిరుచ్చిలో శ్రీకృష్ణ స్వామి వేంచేయగా పార్వేట మండపంలో పుణ్యాహవచనం, ఆరాధన, నివేదన చేసి హారతులు ఇచ్చారు. అనంతరం శ్రీకృష్ణస్వామి వారిని సన్నిధి యాదవ పూజ చేసిన చోటుకు తీసుకెళ్లి పాలు, వెన్న, హారతులు సమర్పించారు. ఆ తర్వాత శ్రీ మలయప్పస్వామి వారు కొంత దూరము పరుగెత్తగా.. ఆయన తరపున అర్చకులు బాణమువేసిన తర్వాత వెనక్కి వచ్చారు. ఇలా మూడుసార్లు చేశారు. ఆ తర్వాత తిరిగి ప్రధాన ఆలయం వద్దకు ఉత్సవ మూర్తులను తీసుకురావడంతో పార్వేట ఉత్సవం ముగిసింది. ఈ ఉత్సవంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మీ దంపతులు హాజరయ్యారు. ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం పవిత్ర ధనుర్మాసకాలం మంగళవారం నాడు ముగియడంతో బుధవారం నుండి శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభమైంది. గత ఏడాది డిశెంబరు 16 నుండి జనవరి 14 వరకు ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం జరిగిన విషయం విదితమే. సరిగ్గా నెల రోజుల విరామమం తరువాత శ్రీవారి సుప్రభాతసేవ పునః ప్రారంభం కావడం విశేషం.





