- తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండు బానేష్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సర్వే సామర్థవంతంగా నిర్వహించి, వారికి పట్టా పాసు పుస్తకాలు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండు బానేష్ డిమాండ్ చేశారు. ఈమేరకు జిల్లాలోని భీమిని మండలం అక్కలపల్లి గ్రామంలో గురువారం ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పేద రైతులకు పట్టా పాసు పుస్తకాలు ఇవ్వలేదని ఆరోపించారు. పేద రైతులు రాయి రప్పలతో ఉన్న గుట్టలను కష్టపడి సాగులోకి తెచ్చుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని, ఇంతవరకు ఆ ఊసే లేదని విమర్శించారు. అటవీ శాఖ అధికారులు సర్వే పారదర్శకంగా నిర్వహించి, పేద ప్రజలకు న్యాయం జరిగేటట్లు కృషి చేయాలని కోరారు. సర్వేలో అక్రమాలు జరిగితే సహించమని, పేద రైతులకు న్యాయం జరిగే వరకు అవిశ్రాంత పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం గ్రామ అధ్యక్షుడు దుర్గం ఓంకార్, కార్యదర్శి దుర్గం రాజేష్, రైతులు మల్లయ్య, బాపు, ముంజం బక్కయ్య, చప్పిడి భీమయ్య, ఇప్ప భీమక్క, జాడి పోశం, దుర్గం భీమయ్య, జాడి దేవక్క లు పాల్గొన్నారు.





