- పది వేల మందితో కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు
- విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటం చేయాలి
- జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పిలుపు
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 12వ తేదీన వైఎస్ఆర్ సీపీ ఫీజుపోరును విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నియోజక వర్గాల అధ్యక్షులతో తుమ్మలగుంటలోని చంద్రగిరి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు ఉన్నత విద్యను చదువుకునే విద్యార్థుల సమస్యలపై ఎప్పటికప్పుడు పోరుబాట చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకుండా పేద విద్యార్థులను అప్పుల ఊబిలోకి నెట్టుతోందన్నారు. పేద పిల్లలకు బాసటగా నిలబడి ప్రభుత్వం నుంచి ఫీజు బకాయిలు విడుదలయ్యేంత వరకు దశల వారీగా పోరాటం చేయాల్సి ఉందన్నారు. అందులో భాగంగానే ఈనెల 12వ తేదీన ఫీజు పోరు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందన్నారు. బాధిత విద్యార్థుల కష్టాలను జిల్లా అధికారులకు తెలియపరచి ప్రభుత్వంకు కనువిప్పు కలిగించేలా చేసేందుకు ఫీజుపోరు ఉపయోగపడుతుందన్నారు. అన్ని ప్రయివేటు కళాశాలల యజమాన్యాలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని, పేద విద్యార్థులను ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపడటం కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
- చిత్తూరు, తిరుపతి కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజుపోరును చిత్తూరు, తిరుపతి కలెక్టర్ కార్యాలయాల వద్ద పది వేల మందికి తక్కువ లేకుండా విద్యార్థులతో కలసి నిరసన వ్యక్తం చేయాలని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి సూచించారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద కుప్పం, పలమనేరు, పుంగనూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాల నుంచి విద్యార్థులను తరలించాలి అన్నారు. అలాగే తిరుపతి కలెక్టర్ కార్యాలయం ముందు సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి, నగరి, చంద్రగిరి, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాల నుంచి విద్యార్థులను తరలించాల్సి ఉంటుందన్నారు. ఫీజు పోరుకు ఎన్ని కాలేజీల నుంచి ఎంత మంది విద్యార్థులు రాగలరన్న సమాచారం ఈనెల 10వ తేదీకి సేకరించినట్లయితే ఆయా నియోజకవర్గాల పార్టీ ఇన్ చార్జిల సహకారంతో వారిని కలెక్టర్ కార్యాలయాలకు తరలించే ఏర్పాట్లు చేయవచ్చని సూచించారు. అనంతరం అన్ని నియోజకవర్గాల వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నూతన అధ్యక్షులను శాలువలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకులు ఓబుల్ రెడ్డి, చిద్విలాసరెడ్డి, శశి, ఎన్.వి. సురేష్, పవన్ కుమార్, డి. లోకేష్, బి.హరి, మహేష్, చెంగల్ రెడ్డి, ప్రేమ్ కుమార్, కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, వినోద్, యుగంధర్, రాజశేఖర్ రెడ్డి, మోహన్ రెడ్డి, హరికుమార్ లు వున్నారు.



