నేటి సాక్షి తిరుపతి జిల్లా, (బాదూరు బాల) తిరుపతిః తిరుపతి అభివృద్ధికి నిధులు దారాలంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కలిసి నియోజకవర్గంలోని పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. ముఖ్యంగా తిరుమల బాలాజీ నగర్ లో పెండింగ్ లో ఉన్న ఇళ్ళ శ్లాబ్ నిర్మాణానికి టిటిడి నిధులు కేటాయించేలా చూడాలని సిఎం చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. ప్రియతమ నాయకులు, మెగాస్టార్ చిరంజీవి ఎమ్మెల్యేగా తిరుమల స్థానికులకు ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో నెరవేరేందుకు ఇదే సరైన సమయం అని ఆయన సిఎంకు వివరించారు. అలాగే తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి మిగిలి ఉన్న పనుల పూర్తితోపాటు గాలిగోపురం మఠం పరిధిలోని శ్రీ కోదండరామస్వామి గుడి జీర్ణోద్దరణ పనులకు టిటిడి చేయూత అందించేలా చేయాలని ఆయన సిఎంను కోరారు. కాగా తిరుపతిలో బలిజ భవన్ నిర్మాణంకు నిధులు మంజూరు చేయడంతోపాటు బిసి భవన్ పూర్తి, బ్రాహ్మణ భవన్ కు స్థలం కేటాయించేలా అధికారులకు సూచించాలని ఆయన సిఎంను కోరారు. మరోవైపు నగరరూపం సంతరించుకున్న తిరుపతిలో 24గంటలు అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం మరిన్ని 11కేవి సబ్ స్టేషన్స్ నిర్మాణానికి అనుమతించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు.




