- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్


నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:– మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల సంబంధిత సామాగ్రి జిల్లాకు చేరుకుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శనివారం జిల్లాకు చేరుకున్న ఎన్నికల సామాగ్రిని జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో రక్షణ చర్యల మధ్య భద్రపరిచారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి సభ్యుల ఎన్నికల నిర్వహణ కొరకు జిల్లాలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణలో భాగంగా ఛాలెంజ్ ఓట్ల పేపర్లు, ఫారాలు 7బి, 14, 14ఎ, 15, బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఫారం -16, బ్యాలెట్ బ్యాక్స్ లు, బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ అధికారులు, పోలింగ్ ఏజెంట్లకు అందించే గుర్తింపు కార్డులు, బ్యాలెట్ పేపర్స్ కౌంటర్ ఫైల్స్, పేపర్ సీల్స్, మెటల్ సీల్స్, ఫర్నీచర్, ఇంకు బాటిళ్లు, సీలింగ్ వాక్స్, గన్నీ సంచులతో పాటు ఇతర ఎన్నికల సంబంధిత సామాగ్రి జిల్లాకు చేరుకుందని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బందికి పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు శ్రీనివాస్ రావు, హరికృష్ణ, వివిధ మండలాల తహశిల్దార్లు, కలెక్టరేట్ పరిపాలన అధికారి రాజేశ్వర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కెవై ప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.





