- – ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలకు నిరసన
- – కరీంనగర్సీపీకి ముస్లింల ఫిర్యాదు
- – కరీంనగర్ వన్ టౌన్లో ఎఫ్ఐఆర్ నమోదు
నేటి సాక్షి, కరీంనగర్: ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ యూసుఫ్ గూడకు చెందిన యూ న్యూస్ యూట్యూబర్ చిలుక ప్రవీణ్పై ముస్లింలు మండిపడ్డారు. మంగళవారం ఆల్ పార్టీస్ ముస్లిమ్స్ ఆధ్వర్యంలో కరీంనగర్ సీపీ గౌష్ఆలంకు వినతి పత్రం సమర్పించారు. ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో కరీంనగర్ నగర ఏసీపీ ఎన్. వెంకటస్వామికి ఫిర్యాదు చేశారు. అనంతరం కరీంనగర్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, చిలుక ప్రవీణ్పై భారత న్యాయ సంహిత 196, 299, 353(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ‘యూ న్యూస్’ ఛానల్ చిలుక ప్రవీణ్ పై చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని సీపీని ముస్లిం ప్రముఖులు కోరారు. దీనికి సీపీ సానుకూలంగా స్పందించారు. కేసు నమోదు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ కోఆప్షన్ మెంబర్ జమీల్, షౌకత్ అలీ, బీఆర్ఎస్ నాయకుడు షేక్ నిజాముద్దీన్(షఫీ), మత పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో మతవిద్వేషాలు రెచ్చగొడితే ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ, కరీంనగర్ సీపీకి విజ్ఞప్తి చేశారు. రాబోయే బక్రీద్ మాసంలో ముస్లింల మనోభావాలను కించపరిచేలా సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ఇలాంటి నీచపు, నీతిమాలిన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, చిలుక ప్రవీణ్ ను తక్షణమే అరెస్టు చేసి, అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీ ఆతిన, మాజీ కార్పొరేటర్లు అఖీల్ ఫిరోజ్, షర్ఫుద్దీన్, నాయకులు అలీబాబా, అజర్ దబీర్, మాజిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.







