- జాతీయ ఓటరు దినోత్సవం వేడుకలో పాల్గోన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి. వేణు
నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి) : ప్రజాస్వామ్య దేశంలో ఓటు మనకు ఉన్న బలమైన ఆయుధమని, దీనిని ఎన్నికల సందర్భంగా పారదర్శకంగా వినియోగించు కొని మంచి పరిపాలన అందించే వారిని ఎన్నుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణు అన్నారు. శనివారం అదనపు కలెక్టర్ డి. వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ఎన్నికల కమీషన్ సీఈఓ అందించిన సందేశాన్ని ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించారు. ఈ సందర్భంగా అందరితో ఓటు హక్కు వినియోగం సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. అదనపు కలెక్టర్ డి. వేణు మాట్లాడుతూ, ఓటు ప్రాముఖ్యతను మరింత బలోపేతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా 2011 సంవత్సరం నుంచి జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, మన దేశంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయని ,ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉద్యోగులు విధులు నిర్వహిస్తారని, ఎవరు భయపడకుండా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు.2025వ సంవత్సరం నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే థీమ్ తో ఓటరు దినోత్సవం జరుగుతుందని, మనమంతా ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని, మన సమస్యలను పరిష్కరించే నాయకులను ఎన్నుకోవాలని తెలిపారు.మన దేశంలో కులం,మతం, ప్రాంతం,వర్గం,భాష, పేదరికం, ధనికులు అనే అంతరం లేకుండా అందరికీ సమానంగా ఓటు హక్కును కల్పించడం జరిగిందని అన్నారు. భారత దేశ భవిష్యత్తు ఖచ్చితంగా ఓటరు చేతిలో ఉంటుందని, ఎన్నికల సమయంలో సక్రమంగా ఓటు హక్కు వినియోగించు కోవాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం అదనపు కలెక్టర్ జిల్లాలో నూతనంగా ఓటు హక్కు పొందిన యువత ను ఓటరుగా నమోదు చేసుకున్నందుకు వారిని కలెక్టర్ అభినందించి ఓటర్ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.





