- జాబితాలపై అభ్యంతరం
- అర్హుల పేర్లు లేవంటూ ఆగ్రహం వాగ్వాదం
- జవాబు చెప్పలేక తలలు పట్టుకున్న అధికారులు
- పోలీస్ పహారా మధ్యన తూతూమంత్రంగా సభలు
- అధికారిక వేదికలపై కాంగ్రెస్ నాయకులు! వెల్లువెత్తిన విమర్శలు
- దళిత మహిళను తిట్టిన కాంగ్రెస్ లీడర్

నర్సింహులపేట, నేటి సాక్షి భూక్య రవి 22 : నిలదీతలు, అధికారుల దాటవేతలతో గ్రామ సభలు గందరగోళంగా జరిగాయి. పేరుకే సర్వే జాబితాలో పేర్లు గల్లంతయ్యాయని ప్రజలు ఎక్కడికక్కడ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డుల జాబితాల్లో అధికార పార్టీ నేతలు చెప్పినోళ్ల అనర్హుల పేర్లే చేర్చారంటూ మండిపడ్డారు. జాబితాలలో తమ పేర్లు ఎలా గల్లంతాయంటూ ప్రశ్నించారు. నర్సింహులపేట మండలం పడమటిగూడెం, కౌసల్యదేవిపల్లి, రామన్నగూడెం, గ్యామ తండా, పెద్దనాగారం గ్రామసభలో బుధవారం పథకాలను అనర్హులను ఎంపిక చేశారంటూ అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల లిస్టుల్లో అవకతవకలు జరిగాయని అధికారులను నిలదీశారు. అర్హులైన లబ్ధిదారుల పేర్లు జాబితాలో లేవని మండల స్పెషల్ ఆఫీసర్లను, అధికారులను, పంచాయతీ కార్యదర్శులను గ్రామస్తులు నిలదీశారు. పడమటి గూడెం గ్రామంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దళిత మహిళపై దురుసుగా ప్రవర్తించారు. జరిగిన గ్రామసభలో ఒక దళిత మహిళ తనకు రైతు ఆత్మీయ భరోసా మరియు ఇందిరమ్మ ఇల్లు రాలేదని తనకు గుంట భూమి కూడా లేదని ప్రశ్నిస్తుండగా అక్కడే ఉన్న కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బూతు పదజాలంతో తిడుతూ, 10 సంవత్సరాల నుండి ఏం పీకావ్ అని మహిళను గౌరవం లేకుండా తిట్టారు. ఇది విన్న గ్రామ ప్రజలు గ్రామ కాంగ్రెస్ నాయకుల పద్ధతి ప్రశ్నిస్తే దాడులు చేస్తారని ప్రజలు వాపోయారు. సభలో గ్రామస్తులు తిరగబడ్డారు. జాబితాలో పేర్లను అధికారులు చదువుతుండగా, తప్పుల తడకగా ఉందని ఆందోళన చేశారు. సమావేశంలో ఎంపీడీవో మాధవి, ఎంపీఓ యాకయ్య, ఏవో వినయ్ కుమార్, డాక్టర్ సౌమ్య, ఎంఈఓ రామ్మోహన్ రావు, సుగుణ, ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.





