- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భావన సమావేశ మందిరంలో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. మంచిర్యాల పట్టణానికి చెందిన పూదరి సునీల్ తన తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించారని, తనకు ఈ-శ్రమ్ కార్డు ప్రమాద భీమా వర్తిస్తుందని, ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. టివిజెఎస్ జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్ కుమార్ తన దరఖాస్తులో మందమర్రి మండలం సారంగపల్లి గ్రామ శివారులో గల భూమిని కొనుగోలు చేయడమే కాకుండా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఆక్రమణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ తన దరఖాస్తులో విద్యార్థులు, ప్రజల అవసరాలను గుర్తించి ఆధార్ కేంద్రాలు అన్ని మండలాలలో ఏర్పాటు చేయాలని కోరారు. బెల్లంపల్లి మండలం పెద్దనపల్లి గ్రామానికి చెందిన కాదాసీ రాయపోసు తన పేరిట గల భూమిని తన కొడుకు ఫోర్జరీ సంతకాలు చేసి తన పేరిట మార్పు చేసుకున్నాడని, ఈ మార్పును రద్దు చేసి భూమిని తన పేరిట మార్చాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మంచిర్యాల పట్టణం గోపాల్ వాడ ప్రాంతానికి చెందిన కె భారతి, బుర్ర దేవిక తాము గత కొన్ని సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నామని, తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరుతూ వేరువేరుగా దరఖాస్తులు అందజేశారు. బెల్లంపల్లి మండలం చాకేపల్లి గ్రామానికి చెందిన పూలబోయిన వెంకమ్మ తనకు భీమిని మండలం చిన్న గుడిపేట గ్రామ శివారులో పట్టా భూమి ఉందని, ధరణి లో ఈ భూమి నిషేధిత భూమి మీద చూపుతోందని, నిషేధిత జాబితా నుండి తొలగించి తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. చెన్నూరు మండలం గంగారం గ్రామానికి చెందిన దుర్గం అంజు గంగారం గ్రామంలో ఆశ కార్యకర్త పోస్టు లేక స్థానిక గర్భిణీలు, వృద్ధులు, పిల్లలు సకాలంలో మందులు అందక ఇబ్బంది పడుతున్నారని, తనకు అవకాశం కల్పించి ఉపాధి అందించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రానికి చెందిన ముక్క శ్యాంసుందర్ తనకు మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా సమీపంలో భూమి ఉందని, ఈ భూమికి గల త్రోవలో కొంత భాగాన్ని కొందరు అక్రమంగా కబ్జా చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఈ విషయమై తమకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ముంతజబొద్దీన్ తన ఇంటికి ఉన్న ఏకైక దారికి అడ్డుపడుతున్న వారిపై తగు విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారుల సమన్వయంతో పరిష్కారం దిశగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.





