- కారులో అక్రమ రవాణా చేస్తుండగా 112 ఎర్రచందనం దుంగలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్
- ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు
- కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
తిరుపతి జిల్లా పుత్తూరు అటవీ ప్రాంతంలో అక్రమ రవాణా చేస్తున్న 112 ఎర్రచందనం దుంగలతో పాటు, రవాణాకు ఉపయోగించిన కారును తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకుని, దీనికి సంబంధించి ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్ సుబ్బారాయుడు గారు ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ గారి అదేశాల మేరకు డీఎస్పీ (ఆపరేషన్స్) జి. బాలిరెడ్డి మార్గనిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ఎస్ఐ కేఎస్ కే లింగాధర్ టీమ్ స్థానిక అటవీ అధికారులు వడమాలపేట, నారాయణవనం ఎఫ్బీఓలు కుమారస్వామి, నూర్ అబ్జలాల్ ల సహకారంతో పుత్తూరు మీదుగా నారాయణవనం వరకు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను తనిఖీ చేసుకుంటూ వెళ్లారు. బుధవారం తిరుమలకుప్పం మెయిన్ రోడ్డులోని రామసముద్రం గ్రామం వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు. వాహనాల తనిఖీలను గమనించిన ఇద్దరు వ్యక్తులు వారి వాహనం దిగి పారిపోడానికి ప్రయత్నించారు. టాస్క్ ఫోర్సు పోలీసులు వెంటనే స్పందించి, వారిని వెంబడించి పట్టుకున్నారు. వాహనం తనిఖీ చేయగా అందులో 112ఎర్రచందనం దుంగలు లభించాయి. వీటి విలువ సుమారు రూ. 45లక్షలు ఉంటుందని అంచనా వేశారు. దుంగలతో పాటు స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించగా, ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.





