- జగిత్యాల అదనపు కలెక్టర్ లత
నేటి సాక్షి, జగిత్యాల బ్యూరో : గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ బి.ఎస్. లత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐ.డి.ఓ.సి సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అడిషనల్ కలెక్టర్ లత సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ లత మాట్లాడుతూ… గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రొటోకాల్ ప్రకారం నిర్వహించాలి. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో వేడుకలు నిర్వహించనున్నందున అందుకనుగుణంగా వేదిక, సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలని అన్నారు. ప్రొటోకాల్ ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికిత్స అందించేలా వైద్య బృందాన్ని వేడుక స్థలం వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, వేడుకలు విజయవంతం అయ్యేలా చూడాలన్నారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావ్, జగిత్యాల ఆర్,డి,వో మధు సూదన్, డి,ఆర్,డి,వో రఘు వరణ్, ఏ,వో హన్మంత రావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.




