- కువైట్ రాయబారికి తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి వినతి
నేటి సాక్షి న్యూస్ తిరుపతి ప్రతినిధి, డాక్టర్ శివ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలోని వలస కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, వైసీపీ రాజ్యసభ ఎంపీ మేడా రఘునాధ రెడ్డి కువైట్ రాయబారిని కలిసి విన్నవించారు. అంతకు ముందు, ఇదే సమస్యపై భారతదేశ విదేశాంగ శాఖా మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్కు తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లేఖ రాశారు. కువైట్లో పనిచేస్తున్న భారతీయ కార్మికులు, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు చెందిన కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నట్టు ఆయనకి వివరించారు. ముఖ్యంగా కఫాలా వ్యవస్థ వలన కార్మికుడి వీసా మరియు హోదా పూర్తిగా ఉద్యోగం ఇచ్చే వారి (కఫీల్) చేతిలో ఉంటుందని ఇది అదనుగా కార్మికుల పాస్పోర్ట్ స్వాదీనం చేసుకొని వారిని శారీరకంగా, మానసికంగా వేధించడం, ఒప్పందం ప్రకారం జీతాలని అందించక పోవడం, జీతాల చెల్లింపులో జాప్యం చేయడం, సరైన మౌళిక సదుపాయాల కొరతతో అనారోగ్యం పాలవుతున్న వారికి సరైన వైద్య సధుపాయాలు అందుబాటులో లేకపోవడం వంటి విషయాలను ఆయనకి వివరించారు. అలాగే కఫీల్ అనుమతి లేకుండా ఉద్యోగం మార్చుకోవడం, దేశం విడిచి వెళ్లడం లేదా వీసా రెన్యూవల్ చేయడం అసాధ్యమని ఈ నిబందనల మూలంగా కార్మికులు దుర్బర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని కువైట్ రాయబారికి వివరించారు. ఈ నేపథ్యంలో, వారి హక్కులను పరిరక్షించేందుకు, సంక్షేమాన్ని కాపాడేందుకు, సమస్యల పరిష్కారానికి కువైట్లో కార్మిక చట్టాల అమలులో మరింత జాగ్రత్తలు తీసుకోవడం, కార్మిక చట్టాలను పటిష్టపర్చడం అవసరం అన్నారు. మానవతా దృక్పథంతో కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని తక్షణ చర్యలు తీసుకోవాలని కువైట్ రాయబారి, అలాగే భారత విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేశారు.





