- మహిళా సాధికారత హబ్ జెండర్ స్పెషలిస్ట్ విజయ

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:– పిల్లలు, మహిళల సంక్షేమం కొరకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మహిళా సాధికారత హబ్ జెండర్ స్పెషలిస్ట్ విజయ తెలిపారు. బుధవారం జిల్లా సంక్షేమశాఖ అధికారి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఫైనాన్స్ లిటరసీ కార్యక్రమ ప్రతినిధి లిప్సికతో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత హబ్ జెండర్ స్పెషలిస్ట్ విజయ మాట్లాడుతూ, పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, బాలిక రక్షణ కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భేటీ బచావో- భేటీ పడావో కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పిసిపిఎస్డిటి యాక్ట్ (గర్భస్థ శిశువు లింగనిర్ధారణ చట్టం), లింగ వివక్షత- లింగ సమానత్వం, బాల్య వివాహాల నిరోధక చట్టం, ఆన్లైన్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, సఖి సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 181, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, మహిళా హెల్ప్ లైన్ నెంబర్ 1930, డిజిటల్ ఎడ్యుకేషన్, పోలీస్ హెల్ప్ లైన్ 100, సీనియర్ సిటిజన్ హెల్ప్ లైన్ నెంబర్ 14567, పోక్సో యాక్ట్, నేషనల్ ఎమర్జెన్సీ నెంబర్ 112, సుకన్య సమృద్ధి యోజన, మిషన్ వాత్సల్య కార్యక్రమాలు, చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. ఈసందర్భంగా ఆడ పిల్లల ప్రాముఖ్యత గురించి, మహిళా సాధికారత అంశాలపై వివరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మహిళలు పాల్గొన్నారు.





