- చెన్నూరు ఏడీఏ బానోత్ ప్రసాద్

నేటి సాక్షి, మందమర్రి:- పుచ్చకాయ పంట సాగులో మెలకులు పాటించి, మంచి దిగుబడి సాధించాలని చెన్నూరు ఏడిఏ బానోతు ప్రసాద్ తెలిపారు. మండలంలోని ఊరు మందమర్రి శివారులో బురుదగూడెంకు చెందిన యువరైతు చరణ్ సాగు చేస్తున్న పుచ్చకాయ క్షేత్రాన్ని చెన్నూరు సహాయ వ్యవసాయ సంచాలకులు బానోత్ ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, వ్యవసాయ విస్తరణ అధికారులు ముత్యం తిరుపతి, సయిండ్ల కనకరాజులతో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా పుచ్చకాయ విత్తనం వేయకముందు బాగా దుక్కి చేసి బాగా ఆగిన పశువుల ఎరువు వేసుకోవాలని, ఆరు ఇంచుల ఎత్తులో బెడ్లు తయారు చేసుకోవాలని, సమతుల ఎరువుల విధానాన్ని పాటించాలని, సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని, రసం పీల్చు పురుగుల నివారణకు డైనోట్ ఫురాన్ వంటి మందులు ఎకరానికి 100 గ్రాములు, ముఖ్యంగా కలుపు లేకుండా చేసి సూక్స్మ దాతు లోప నివారణకు ఫార్ములా 4 వంటి మందులు రెండు మూడు సార్లు అందించాలని సూచించారు. పుచ్చలో బోరాన్ లోపం ఎక్కువగా ఉంటుందని, బోరాన్ లోపం వలన కాయలు వంకర టింకరలుగా ఏర్పడి పగిలి పోయి నాణ్యత దెబ్బతింటుందని తెలిపారు. ఈ లోప నివారణకు బోరాన్ 2గ్రాములు లీటరు నీటికి కలిపి రెండు మూడు దఫాలు పై పాటుగా పిచికారీ చేసుకోవాలని సూచించారు. తదనంతరం సండ్రోన్ పల్లి రైతు వేదికలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో, రైతులు పంట మార్పిడి చేయాలని, ఆయిల్ పామ్ సాగుకై మొగ్గు చూపాలని, ఇది ఒక్కసారి నాటితే ముప్పై సంవత్సరాల వరకు పంటనిస్తుందని, మొదటి నాలుగు సంవత్సరాలు అంతర పంటలుగా పత్తి, పప్పు ధాన్యాల వంటివి సాగు చేసుకొని అదనపు ఆదాయం పొందవచ్చునని, నాలుగో సంవత్సరం నుండి ప్రతి ఎకరాలో రెండు టన్నులతో మొదలైన దిగుబడి ఐదు ఆరు సంవత్సరాల్లో పది టన్నులకు చేరి, దాదాపు రెండు లక్షల నికర ఆదాయాన్ని ఇస్తుందని, ప్రభుత్వ సబ్సిడీ సైతం ఉంటుందని వివరించారు. అదే విదంగా పొలాలు, చెండ్లలో విద్యుత్తు హై టెన్షన్ లైన్ క్రింద వ్యవసాయ వ్యర్థాలను కాల్చరాదని, ఆయిల్ పామ్ సాగు చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని సారంగపల్లి, పొన్నారం, మామిడిగట్టు, చిర్రకుంట, ఆదిల్ పేట్ గ్రామాల రైతులు పాల్గొన్నారు.





