సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజలింగు మోతె
నేటి సాక్షి, మంచిర్యాల :
రైతు ధనవంతుడైతే, దేశం అభివృద్ధి చెందుతుందని సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజలింగు మోతె అన్నారు. బుధవారం కనుమ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో పలు పథకాలు అమలవుతున్నప్పటికీ వ్యవసాయ కుటుంబాలు పెడితే గాని సంక్షోభంలో కొనసాగుతున్నాయని తెలిపారు. రైతు కుటుంబాలు ఇంకా పేదరికంలోనే కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. గ్రామీణ ప్రజలు ప్రభుత్వాల, అధికారుల దయ కోసం, పథకాల అమలు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. గ్రామీణ ప్రజలకు, రైతులకు రాజకీయ పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా సంవత్సరాల పాటు కాలయాపన చేస్తున్నాయన్నారు. వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్న గ్రామీణ కుటుంబాలకు సాగు భూమి హక్కుగా లేదన్నారు. దేశంలో మొత్తం సాగు భూములను జాతీయం చేయాలన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదనను అప్పటి రాజకీయ వ్యవస్థ ఆమోదించి ఉంటే, వ్యవసాయ కుటుంబాలకు సాగుభూమి అందుబాటులో ఉండేదన్నారు. రాజ్యాంగ ముందు అందరూ సమానమే అని చెప్పే మాటలు వినడానికి బాగానే ఉన్నా, గ్రామీణ ప్రజలు అతి తక్కువ సమానమని ఆచరణలో కనబడుతుందన్నారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే, వారికి ఉత్పత్తులు పథకాలు, సేవలు అన్ని చట్టబద్ధ హక్కుగా చేయాలన్నారు. ప్రభుత్వ సేవలన్నీ రైతులకు నిర్దిష్ట కాలపరిమితిలో అందేలా సిటిజన్స్ రైట్స్ చట్టాన్ని ఆమోదించాలన్నారు. రైతుల సాంఘిక భద్రతకు చట్టబద్ధత కల్పించాలన్నారు. చట్టాల రూపకల్పనలో రైతులను భాగస్వామ్యులను చేయాలన్నారు. అప్పుడే రైతు ధనవంతుడు అవుతాడని, తద్వారా దేశం పురోభివృద్ధి చెందుతుందన్నారు.





