జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- సమాజంలో చదువు రాని వారి కోసం చదువుకున్న వారు బాధ్యత వహించి చదువు చెప్పాలని, కాసిపేటను 100 శాతం అక్షరాస్యత మండలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్లో అక్షర వాలంటీర్లు, సూపర్వైజర్లకు చదువు నేర్పించడంపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి, ఎస్సి కార్పొరేషన్ ఈడి దుర్గాప్రసాద్, జిల్లా విద్యాశాఖ అధికారి లలిత లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని వయోజన విద్య, వెనుకబడిన తరగతుల అభివృద్ధి, మైనార్టీ, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, విద్యాశాఖల అధికారులు తమ పరిధిలోని సిబ్బంది సమన్వయంతో కాసిపేట మండలంలో 100 రోజుల్లో 100 శాతం అక్షరాస్యత సాధించాలని, ఇందు కొరకు అన్ని శాఖలు సహాయ సహకరాలు అందించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కాసిపేట మండలంలోని 2 వేల 5 మంది మహిళలు, 1 వేయి 447 మంది పురుష నిరక్షరాస్యులకు చదువు నేర్పించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, అధికారులు, సిబ్బంది, అక్షర వాలంటీర్లు, చదువుకున్న వారు తమ వంతు బాధ్యత వహించి అక్షరాస్యులుగా మార్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి కె చౌదరి, క్వాలిటీ ఎడ్యుకేషన్ సమన్వయకర్త సత్యనారాయణ మూర్తి, సమన్వయకర్తలు, రీపోర్స్ పర్సన్లు, అక్షర వాలంటీర్లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.





