- జగిత్యాల డిఆర్డిఓ రఘువరణ్
నేటిసాక్షి, రాయికల్ : ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని జగిత్యాల జిల్లా డిఆర్డీవో అధికారి రఘువరన్ అన్నారు. శుక్రవారం రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో జరుగుతున్న ఫారం ఫండ్, హరితవనాలు,నర్సరీ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కూలీలను గ్రూపుల వారిగా పిలిచి మస్టర్ రోల్ కాల్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరి డిమాండ్ తీసుకొని పని కల్పించాలన్నారు. ప్రతి గ్రామంలో 50 మందికి తగ్గకుండా ఉపాధి హామీ పనులకు వచ్చే విధంగా పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు కృషి చేయాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయని పని ప్రదేశంలో కూలీలకు కనీస వసతులు కల్పించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేసవికాలం దృష్ట్యా పని ప్రదేశంలో త్రాగు నీరు, నీడతో పాటు అవసరమైన మందులు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. నర్సరీలలో మొక్కలను సంరక్షించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీవో దివ్య, పంచాయతీ కార్యదర్శి స్వర్ణ,టెక్నికల్ అసిస్టెంట్ వీణారాణి, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్, కారోబార్ ప్రశాంత్, ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.




