- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:– జిల్లాలో పత్తి కొనుగోలు పూర్తి అయ్యే వరకు ప్రక్రియ కొనసాగుతుందని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల సంక్షేమం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియ ముగిసే వరకు కొనసాగుతుందని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. ఆధార్ వెరిఫికేషన్ లో ఓటిపి ప్రక్రియలో సర్వర్ డౌన్ ఉన్న కారణంగా పత్తి కొనుగోలు నిలిపివేయడం జరిగిందని, ప్రస్తుతం సర్వర్ రిస్టోర్ ప్లానింగ్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం వివరాల ప్రకారం రైతుల నుండి పత్తి కొనుగోలు చేసి సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలులో ఇబ్బందులు తలెత్తకుండా రైతుల నుండి టోకెన్ పద్దతిన పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు సహకరించాలని తెలిపారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరతో రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందని, తేమ శాతం నిబంధనలకు లోబడి ఉండేలా రైతులు చూసుకోవాలని తెలిపారు. కౌలు రైతుల సంక్షేమంలో భాగంగా వ్యవసాయ, మార్కెటింగ్ అధికారుల సమన్వయంతో సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పాత్రికేయులు పాల్గొన్నారు.





