- డా. రసమయి బాలకిషన్
- దీక్షకు బిజెపి, బిఆర్ఎస్ నాయకుల సంఘీభావం

నేటి సాక్షి, బెజ్జంకి:
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేవరకు గ్రూప్ పరీక్షల ఫలితాలను విడుదల చేయకూడదని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు వడ్లూరి పర్శరాములు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారం 7వ రోజుకు చేరుకున్నాయి. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, బిజెపి మండలశాఖ నాయకులు దీక్ష శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డా. రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. మందకృష్ణ మాదిగ గారి పోరాటం వల్లే మాదిగ ఉపకులాలకు హక్కులు సాధ్యమయ్యాయి. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో సెమిమ్ అక్తర్ కమిషన్ నివేదికను సమీక్షించి, చట్టాన్ని అమలు చేసి న్యాయం చేయాలని అన్నారు. బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు కరివేద మహిపాల్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు కొలిపాక రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పును గౌరవించి, అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పింది. కానీ, ఏడు నెలలు గడిచినా చట్టం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ప్రకటించి, లోక్సభలో బిల్లు ప్రవేశ పెట్టింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. మాదిగలకు న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు లింగాల లక్ష్మణ్, వంగాల నరేష్, బాబు, బిజెపి నాయకులు బోయినిపెల్లి అనిల్ రావు, బుర్ర మల్లేశం, సాన వేణు, సంఘ రవి, గైని రాజు, కొత్తపేట రామచంద్రం, దొడ్ల ప్రశాంత్, MRPS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





