
నేటిసాక్షి, రాయికల్: రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలోని రైతువేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మామిడి తోటలలో ప్రస్తుతం చేపట్టే సస్య రక్షణ చర్యలపై రైతులకు శిక్షణా కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ శిక్షణ సదస్సులో పొలాస కీటక విభాగ శాస్త్రవేత్త స్వాతి మాట్లాడుతూ తేనెమంచు పురుగు రాకుండా తయోమెతోక్సిమ్ 4గ్రాములు లేదా ఫిప్రోనిల్ 20 ఎంఎల్ లేదా ఇమిడాక్లోప్రిడ్ 4 ఎంఎల్ 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. పొలాస తెగుళ్ల విభాగ శాస్త్రవేత్త బలరాం మాట్లాడుతూ బూడిద తెగులు ఆశిస్తే హేక్సకొనాజోలు 20 ఎంఎల్ 10 లీటర్ల నీట్లో కలిపి స్ప్రే చేయాలి. బంక తెగులు రాకుండా ట్రైకోడర్మా విరిడే భూమిలో వేయాలని తెలిపారు. ఉద్యాన శాస్త్ర వేత్త స్వాతి మాట్లాడుతూ పిందెలు బఠాణి సైజు దశలో ఉన్నప్పుడు ప్లానోఫిక్స్ 2 ఎంఎల్, 10 లీటర్ల నీటిలో కల్పి స్ప్రే చేయడం ద్వారా పిందెలు రాలడాన్ని అరికట్టవచ్చన్నారు. చెట్లకు కంపోస్ట్, యూరియా, పోటాష్ ఎరువులు ఇవ్వాలని సూచించారు. పిందెలు నిమ్మకాయ సైజు దశలో 13-0-45 మందును 1కెజి 100 లీటర్ల నీటిలో కల్పి స్ప్రే చేయడం ద్వారా కాయ సైజు త్వరగా పెరుగుతుందన్నారు. పిందె దశలో సక్రమంగా నీటి తడులు అందించాలని లేదా డ్రిప్ ద్వారా నీటిని ఇవ్వాలని తెలిపారు. జగిత్యాల ఉద్యాన అధికారి కందుకూరి స్వాతి మాట్లాడుతూ మామిడిలో కోత అనంతరం జనుము లేదా జీలుగ వేసి దున్నినట్లయితే భూమి సారం పెరుగుతుందని,పూత దశలో తేనెటీగల పెంపకం కూడా చేబడితే అధిక శాతం పిందెలు కడతాయని తెలిపారు. కొత్తగా పండ్ల తోటలు పెట్టె రైతులకు మామిడి, జామ, నిమ్మ, బొప్పాయి, అరటి, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలకు ఎంఐడిహెచ్ పథకం ద్వారా రాయితీ ఇవ్వబడునని తెలిపారు. అనంతరం భూపతిపూర్ గ్రామంలోని మామిడి తోటలను, ఆలూరు గ్రామంలోని పుచ్చ తోటలను పరిశీలించి రైతులకు తగు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ పామ్ ప్రతినిథి రాజేష్, డ్రిప్ కంపెనీ ప్రతినిధి తిరుపతి, రైతులు పాల్గొన్నారు.





