Friday, March 13, 2026

పారదర్శకంగా సంక్షేమ పథకాల లబ్దిదారుల జాబితా

  • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి :-
ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేందుకు అధికార యంత్రాంగం సమన్వయంతో పని చేసి పారదర్శకమైన లబ్దిదారుల జాబితా రూపొందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ మున్సిపల్ పరిధిలో గల శ్రీరాంపూర్ కాలనీ 5వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో నస్పూర్ మున్సిపల్ కమీషనర్ సతీష్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇల్లు లేని నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం క్రింద ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు లేని అర్హత గల నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తింపచేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కొరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాల పరిశీలన అనంతరం అర్హుల జాబితాలో ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రాధాన్యత క్రమంలో అత్యంత నిరుపేద అర్హులకు పథకం ఫలాలు అందించడం జరుగుతుందని తెలిపారు. జాబితాలో వివరాలు రాని వారు దరఖాస్తు చేసుకోవచ్చని, రేషన్ కార్డుల జారీలో నిబంధనలు పాటిస్తూ అర్హులైన అభ్యర్థుల వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో మీ-సేవ కేంద్రాలలో చేసుకున్న దరఖాస్తులు, సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య, రాజకీయ, కుల గణన కార్యక్రమంలో సేకరించిన సమాచారం, ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలు జాబితాలో రానప్పటికీ మండల ప్రజా పరిషత్ కార్యాలయాలు, ప్రజాపాలన సేవా కేంద్రాలలో, వార్డు సభలలో దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఆహార భద్రత రేషన్ కార్డు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. రైతు భరోసా పథకంలో వ్యవసాయ యోగ్యం కాని రాళ్లు, గుట్టలు, కాలనీలు, ఇండ్ల వెంచర్లు, లే-అవుట్లు, రైల్వే, నాలా భూములు, వివిధ అభివృద్ధి పథకాల కొరకు ప్రభుత్వం సేకరించిన భూములు జాబితా నుండి తొలగించాలని తెలిపారు. వ్యవసాయ యోగ్యం గల భూమికి రైతు భరోసా ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం క్రింద నిరుపేద కూలీలు, వ్యవసాయ కూలీలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పని చేసిన కుటుంబాలను గుర్తించి, అర్హత మేరకు అర్హులైన లబ్దిదారులకు పథకం వర్తింపజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకు గ్రామపంచాయతీలలో గ్రామసభలు, మున్సిపాలిటీలలో వార్డు సభలు నిర్వహించి అర్హులైన వారి జాబితాను చదివి వినిపించిన అనంతరం జాబితాలో లేని వారి నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, గ్రామ సభ నిర్వహించే ముందు ఆయా ప్రాంతాల ప్రజలకు సమాచారం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News