- ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం
నేటి సాక్షి, బెజ్జంకి: మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కూడలి వద్ద శుక్రవారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు వడ్లూరి పర్శరాములు ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పర్శరాములు మాట్లాడుతూ, ఆర్థిక, విద్యా, వైద్యం, ఉపాధి హక్కులు బలహీన వర్గాలకు పూర్తిగా అందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తక్కువ జనాభా గల వర్గాలకు ఎక్కువ హక్కులు, ఎక్కువ జనాభా ఉన్న వర్గాలకు తక్కువ హక్కులు దక్కడం రాజ్యాంగ విరుద్ధమని, అందుకే ఎస్సీ వర్గీకరణ తప్పనిసరిగా అమలుకావాలని అభిప్రాయపడ్డారు. 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తేదీ 04-02-2025న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడం హర్షణీయమని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అక్తర్ సమీమ్ కమిషన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాదిగ ఉపకులాలకు 11% రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి చింతకింది పర్శరాములు, గౌరవ సలహాదారులు తాడిచెట్టు భూమయ్య, ప్రధాన కార్యదర్శి మోదుంపల్లి రాజు, ప్రచార కార్యదర్శి బట్టు ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





