- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్



నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:– రహదారి ప్రమాదాలు, తలసేమియా, గర్భిణులు, అత్యవసర సమయాలలో రక్తం అవసరం ఉన్న వారి సంక్షేమం కోసం స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని టి కన్వెన్షన్ హాల్లో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదానం కంటి పరీక్షల శిబిరానికి డిసిపి ఎ భాస్కర్, జిల్లా రవాణా అధికారి సంతోష్ కుమార్, ఆసుపత్రి పర్యవేక్షకులు హరీష్ చందర్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డిలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రమాదాలు, అత్యవసర సమయాలలో రక్తం కావలసిన వారి సంక్షేమం కోసం స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. అన్ని దానాలలో కన్నా రక్తదానం చాలా గొప్పదని, ఒకరి ప్రాణాలు కాపాడటం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. 40 సంవత్సరాలు వయస్సు దాటిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల బాధ్యత అని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో తమ వంతు పాత్ర పోషించాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లు, ఇతర వాహనాల చోధకులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పాటించాలని, కూడళ్ళ వద్ద సిగ్నల్స్ లను తప్పనిసరిగా అనుసరించాలని, నియంత్రిత వేగంతో వాహనాన్ని నడపాలని తెలిపారు. వాహనం నడిపే సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని, మద్యం సేవించి వాహనం నడుపకూడదని, వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటుందని, వేగ నిరోధకాలతో పాటు వాహనదారులకు అర్థమయ్యే విధంగా ప్రమాద ప్రాంతాలు, మూలమలుపు ఇతర అన్ని ప్రాంతాలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వాహన తనిఖీలలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినట్లయితే జరిమానా విధించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయడం తెలిపారు. 18 సంవత్సరాలు నిండని వారికి, లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వరాదని తెలిపారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా రోడ్డు భద్రతా నియమ, నిబంధనలను వివరిస్తూ ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రక్తదాన శిబిరంలో 53 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారని, అనంతరం రక్తదానం చేసిన వారికి ధృవపత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంవిఐ రంజిత్, ఎఎంవిఐ ఖాసీం, సూర్యతేజ, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు చందూరి మహేందర్, సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.





