- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి :- జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో జనవరి 25వ తేదీన 15వ ఓటరు దినోత్సవ వేడుకలను అన్ని శాఖల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. 15వ జాతీయ ఓటరు దినోత్సవంలో ఓటు లాంటిది ఇంకొకటి లేదు ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరచడం జరుగుతుందని తెలిపారు. ఓటరు సంబంధిత పోస్టర్లు, బ్యానర్లు, ప్రసార మాధ్యమాలు, ప్రచార కార్యక్రమాల ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారుల పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో ఆడియో, వీడియో సందేశాల ద్వారా ఎన్నికలలో తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఓటరు దినోత్సవ నినాదాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్లను ఓటు వేసేలా ప్రోత్సహిస్తూ వారిని స్ఫూర్తిదాయంగా చూపించడం జరుగుతుందని, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, రైల్వే, పంచాయతీరాజ్ ఇతరత్రా శాఖల సమన్వయంతో, కార్పొరేట్ సంస్థలు, సొసైటీల ఆధ్వర్యంలో వ్యాసరచన, ఉపన్యాసం, వెబినార్, సెమినార్ల ద్వారా ప్రజలందరికీ తెలిసేలా ఓటు ఆవశ్యకతను వివరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ శాఖలు వారి కార్యాలయంలో ఓటరు ప్రతిజ్ఞ చేసి సంబంధిత సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేపట్టాలని తెలిపారు. నూతనంగా నమోదు కాబడిన ఓటర్లను గుర్తించి వారిని సన్మానించి, ఓటరు గుర్తింపు కార్డులను అందించడం జరుగుతుందని, ప్రాంతీయ భాషలో ఈవిఎం, వివి ప్యాట్, పోస్టల్ బ్యాలెట్, పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలు, హెల్ప్ లైన్ యాప్, ఓటు విలువ తదితర అంశాలపై ప్రజలకు అర్థమయ్యే రీతిలో వీడియోలు రూపొందించి ప్రదర్శించడం జరుగుతుందని, దినపత్రికలు, హోర్డింగుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో జనవరి 25వ తేదీన నిర్వహించనున్న జాతీయ ఓటరు దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అందరు కలిసి రావాలని తెలిపారు.





