- జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): పచ్చదనం, పరిశుభ్రతకు కృషి చేయాలని జిల్లా పాలనాధికారి బి. సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం ఉమ్మడి వెల్గటూర్ మండలంలో అధికారులతో కలిసి పర్యటించిన జిల్లా కలెక్టర్ ముందుగా గుల్లకోట గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనం పనులు, వైకుంఠధామం, కంపోస్ట్ ఎరువులతో పాటు డంపింగ్ యార్డును ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ… బృహత్ పల్లె ప్రకృతి వనంలో పిచ్చి మొక్కలను తొలగించి రకరకాల పండ్ల పూల చెట్లను పెంచాలని సూచించారు. అలాగే వైకుంఠధామంను పరిశీలించి ఆవరణలో ఉన్న చెత్తను తొలగించాలని, దహన సంస్కరణలకు అవసరమైన నీటి సదుపాయంలో ఇబ్బంది లేకుండా చూడాలని, స్థానాల గదులు కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ప్రహరీ గోడ చూట్టు పూర్తిస్థాయిలో పిచ్చి మొక్కలు తొలగించి మంచి పూల మొక్కలను నాటించి వైకుంఠదామంను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. తదుపరి డంపింగ్ యార్డ్ కంపోస్ట్ షెడ్లను పరిశీలించి, తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని, చెత్త వ్యర్ధాలను ఆరుబయట, బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లపైన పడేయకుండా పరిశుభ్రంగా ఉండేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చెగ్యాం గ్రామంలో నర్సరీని, అలాగే జామ తోటను పరిశీలించి, పిచ్చి మొక్కలను తొలగించి పండ్ల మొక్కలను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, డిపిఓ మదన్మోహన్, ఎండపల్లి తహశీల్దార్ రవికాంత్, వెల్గటూరు తహశీల్దార్ శేఖర్, ఎంపీడీవో శ్రీనివాస్, నాయబ్ తహశీల్దార్ అనిల్, గిర్థావర్ ఆన్వేష్, ఎంపీవోలు, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.





