నేటి సాక్షి, మందమర్రి:- రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధిస్తూ, సింగరేణి అభివృద్ధికి పాటుపడుతూ ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక కావాలని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టియుసి) ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య తెలిపారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏరియాలోని కాసీపేట 1 గని నుండి ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు తీసుకున్న బి రిలే సర్ఫేస్ ట్రామర్ శ్రీనివాస్ ను శుక్రవారం గని ఆవరణంలో యూనియన్ సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భూమయ్య మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేస్తూ, ఉద్యోగులను ప్రోత్సహిస్తుందని, వారిని ఆదర్శంగా తీసుకొని, ఉద్యోగులందరూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధిస్తూ, ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక కావాలని ఆకాంక్షించారు. 135 సంవత్సరాల చరిత్ర గల సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సింగరేణి బొగ్గు క్షేత్రాలను ప్రైవేటీకరణ చేయడం, సింగరేణికి కొత్త గనులు రాకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కార్మిక నేత ఐఎన్టీయూసీ నాయకుడు జనక్ ప్రసాద్ సూచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి, సింగరేణి బొగ్గు క్షేత్రాలను సింగరేణికి ఇవ్వాలని కోరిన విషయాన్ని, అదే విధంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వేలంపాటలో సింగరేణి బొగ్గు క్షేత్రాలు వేలంపాటను నిరసిస్తూ వినిపించిన నిరసన గలాన్ని ఆయన గుర్తు చేశారు. సింగరేణి కార్మికుల సొంతింటి కల నిజం చేయడం, ఐటి మాఫీ చేయడం, కొత్త గనులకై జనక్ ప్రసాద్ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో, సింగరేణి యాజమాన్యంతో చర్చిస్తున్నారని, ఆయనకు అండగా కార్మికు లోకం నిలబడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కేంద్ర కమిటీ ప్రచార కార్యదర్శి బన్న లక్ష్మణ్ దాస్, నాయకులు సోగల కన్నయ్య, పిట్టల శివకృష్ణ, ఎర్రబెల్లి శంకర్, రాజేశం, గొర్ల శ్రీనివాస్, సంపత్, రవి, ప్రవీణ్, నాగరాజు లు పాల్గొన్నారు.





