
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని ఇదొక నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, జౌళి, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం హైదరాబాద్ నుండి నూతన రేషన్ కార్డులు జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాలపై రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతి కుమారిలతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్డీఓ కౌసల్యాదేవి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డి ఎస్ సి డిఓ కిష్టయ్య, డిఎఓ అనురాధ, బల్దియా అదనపు కమిషనర్ జోనా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన చిట్ట చివరి వ్యక్తికి పథకాలు అందచేయు కార్యక్రమం కొనసాగుతూనే వుంటుందని, ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జాభితాలో పేర్లు రాని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కుల, సామాజిక, ఆర్థిక సర్వే, పాత రేషన్ కార్డుల ఆధారంగా పేర్లు నమోదు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. వీటిల్లో ఎవరైనా పేర్లు రాని వారుంటే ఈ నెల 21వ తేది నుండి జరిగే గ్రామ సభలలో దరఖాస్తు చేసుకోవాలని మంత్రులు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి పథకాలు అందజేస్తామని, ఇప్పుడు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అర్హులైన అందరికి రేషన్ కార్డులు అందజేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని మంత్రులు వివరించారు. రైతు భరోసా పథకానికి వ్యవసాయ యోగ్యం కానీ భూములను గుర్తించడానికి నియమించిన విచారణ టీములు వ్యవసాయ యోగ్యం కానీ భూముల వివరాలు పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ అధికారులు, తహసీల్దార్లు సమన్వయం తో పని చేసి నివేదిక ఇవ్వాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారుల వద్ద పంట సాగు వివరాలు, తహసీల్దార్లు వద్ద నాల భూముల కన్వర్షన్ వివరాలు పరిశీలన చేయాలని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా లభిస్తుందని తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు పంపిణీలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు వివరాలను గ్రామసభలు నిర్వహించి గ్రామ సభలో చర్చిస్తామని, దరఖాస్తు చేసుకోని వారికి కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని, పేదవాని సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు పేర్కొన్నారు. ప్రతి జిల్లా నుండి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మంత్రులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. గ్రామసభలు నిర్వహించడంలో నీడ కొరకు టెంట్, మంచి నీరు, కుర్చీలు తప్పక ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి గ్రామంలో తప్పకుండా గ్రామ సభ నిర్వహించి ప్రతి రోజు మంత్రులకు, పై అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ లు చాలా కష్టపడుతున్నారని ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చడంలో కలక్టర్ల పాత్ర చాలా కీలకమని సీఎస్ తెలిపారు.





