నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన బి శేఖర్ రెడ్డి (32) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మానవపాడు గ్రామానికి చెందిన బొంకూరు శేఖర్ రెడ్డి గత మూడేళ్ళ నుంచి పంటలు పండిస్తూ దిగుబడులు రాక అప్పుల్లో కురుకుపోయాడు. ఈ సారైనా పంటలు బాగా పండితే అప్పులు తీర్చుదామని అనుకున్నాడు. ఆర్డీఎస్ కు సాగునీరు రాకపోవడం..మిర్చి పంటకు పూర్తిగా తెగులు వ్యాపించడంతో మిర్చి పంట పూర్తిగా నష్టం వాటిల్లింది.ఈ సంవత్సరం కూడా పంటలు రాకపోవడంతో అప్పు ఎలా తీర్చాలో అర్థం కాక మనస్థాపం చెంది తన సొంత పంట పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పంట పొలంలో ఉన్న రైతును గమనించి హుటాహుటిన మానవపాడు ఆసుపత్రికి తరలించారు. దీంతో అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఈ విషయం గురించి పోలీసులకు వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం రాలేదని సమాచారం రాగానే తెలియపరుస్తామని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఓ బాబు ఉన్నట్లు సమాచారం. మిర్చి పంట చేతికి రాలేదని యువరైతు ఆత్మహత్య




