నేటి సాక్షి, మునగాలమునగాల మండలంలోని రేపాల గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణి స్త్రీకి సురక్షితంగా ప్రసవం నిర్వహించి వైద్య సిబ్బంది తమ సేవాభావాన్ని చాటుకున్నారు.జగన్నాథపురం గ్రామానికి చెందిన వెంపటి వీరబాబు కుమార్తె లక్ష్మీ భవానికి అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ విధుల్లో ఉన్న డాక్టర్ వినయ్ కుమార్ పరిస్థితిని సమీక్షించి తక్షణ వైద్య సహాయం అందించారు.పరిస్థితిని చాకచక్యంగా నిర్వహిస్తూ సురక్షితంగా ప్రసవం జరిపించారు. తల్లి, (మగ)శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ—గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమర్థవంతమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, గర్భిణీలు ఏ చిన్న సమస్య వచ్చిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.ఈ ఘటనతో రేపాల పీహెచ్సీపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా తల్లి-శిశు మరణాలను తగ్గించవచ్చని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.





