నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : ( కోక్కుల వంశీ )తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ రాష్ట్ర శాసనసభలో గల్ఫ్ కార్మికుల సంక్షేమ అంశాలపై కీలకంగా మాట్లాడారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు చేయడంతో పాటు, గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఆయన గుర్తు చేశారు.ఈ సందర్భంగా 2026–27 బడ్జెట్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి, వారికి సమగ్ర సహాయం అందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే సీఎం ప్రవాసి ప్రజావాణి ఫిర్యాదు కేంద్రంలో గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు.గల్ఫ్ కార్మికుల పిల్లల విద్యకు పెద్దపీట వేయాలని, సుమారు 10 లక్షల మంది గల్ఫ్ కార్మికుల పిల్లలు ఉన్న నేపథ్యంలో, 2026–27 విద్యా సంవత్సరానికి గురుకులాల్లో వారికి ప్రత్యేకంగా సీట్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ప్రవాసి భారతీయ దివస్ తరహాలో, రాష్ట్ర స్థాయిలో “ప్రవాసి తెలంగాణ దివస్” నిర్వహించి, ప్రవాసులను సత్కరించడంతో పాటు వారి సమస్యలను వినడం ద్వారా వారికి మనోధైర్యం కల్పించవచ్చని తెలిపారు. ఈ దిశగా TOMCOM, NAC సంస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.గల్ఫ్ వలస తాత్కాలికమైనదని పేర్కొంటూ, గల్ఫ్ ఎన్ఆర్ఐల కుటుంబాలకు సంబంధించిన రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను సులభతరం చేసి, ప్రభుత్వం వారి అండగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.గల్ఫ్ కార్మికులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వంతు అందిస్తున్నారని, వారి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం మరిన్ని ప్రజాహిత నిర్ణయాలు తీసుకోవాలని ఆది శ్రీనివాస్ శాసనసభ దృష్టికి తీసుకువచ్చారు.వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రతి నెల సుమారు 100 ప్రసవాలు జరుగుతున్నాయని ప్రస్తుతం ఉన్న మాత శిశు సంరక్షణ(MCH) ను 50 పడకలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు..

