నేటి సాక్షి మహబూబాబాద్(భూక్యా రవినాయక్) జనవరి 28 రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఎస్టీలకు చైర్మన్ పదవుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త జాదవ్ రమేష్ నాయక్ తీవ్రంగా ఖండించారు.రాష్ట్రంలో మొత్తం 123 మున్సిపాలిటీలు ఉండగా, ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ఎంఎస్ నెంబర్ 14 (తేదీ: 13-01-2026) ప్రకారం ఎస్టీలకు కేవలం 5 చైర్మన్ పోస్టులు మాత్రమే కేటాయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అయితే జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే ఎస్టీలకు కనీసం 7 చైర్మన్ పదవులు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.మున్సిపాలిటీల్లో మొత్తం 2,996 వార్డులు ఉండగా, అధికారిక అనెక్సర్ ప్రకారం ఎస్టీలకు కేవలం 180 వార్డులు మాత్రమే కేటాయించారని తెలిపారు. ఇది మొత్తం వార్డుల్లో 6 శాతం మాత్రమే అవుతుందని అన్నారు.2011 జనగణన ప్రకారం రాష్ట్రంలో ఎస్టీ జనాభా శాతం 5.8 శాతంగా ఉన్నప్పటికీ, చైర్మన్ పదవుల్లో మాత్రం కేవలం 4.13 శాతం మాత్రమే కేటాయించడం ఏ విధంగానూ సమంజసం కాదని మండిపడ్డారు. ఇది స్పష్టమైన వివక్షకు నిదర్శనమని పేర్కొన్నారు.ప్రభుత్వంలో ఉన్న గిరిజన నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న గిరిజన ప్రజాప్రతినిధులు ఈ అన్యాయానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎస్టీలకు న్యాయం చేయడంలో వారు విఫలమైతే, భవిష్యత్తులో జాతి ద్రోహులుగా మిగిలిపోతారని జాదవ్ రమేష్ నాయక్ తీవ్ర హెచ్చరిక చేశారు.ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి, జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్టీలకు రావాల్సిన 7 చైర్మన్ పదవులు కేటాయించాలని లంబాడీల ఐక్య వేదిక డిమాండ్ చేసింది.





