నేటి సాక్షి గజ్వేల్….ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య డిమాండ్ చేశారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె మూడో రోజుకు చేరుకున్న నేపథ్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో ఎదుట గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఇటీవల మరణించిన వెంకట్ గౌడ్ మృతికి ఉద్యోగులు సంతాపం తెలిపారు. అనంతరం డిపో నుంచి గజ్వేల్ అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.ఎల్లయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే యూనియన్లతో చర్చలు జరిపి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యూనియన్లను గుర్తించి పీఆర్సీ బకాయిలు, బకాయి డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు.డ్రైవర్లు, కండక్టర్లపై అక్రమ కేసులు నమోదు చేయడం, కారణం లేకుండా సస్పెండ్ చేయడం జరుగుతోందని ఆరోపించారు. డిపో మేనేజర్ల వేధింపులు పెరిగాయని, వాటిని తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు. రోజువారీ విధుల్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు.అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, నిర్వహణను ప్రైవేటుకు అప్పగించకుండా ఆర్టీసీ ద్వారానే చేపట్టాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి, నాయకుడు రంగారెడ్డి, ఆర్టీసీ ఉద్యోగులు నర్సింలు, చంద్రం, శ్రీధర్, రాణి, కవిత తదితరులు పాల్గొన్నారు.





