నేటి సాక్షి, ఎండపల్లి:* మండల పరిధిలోని గ్రామాల నుంచి మైనారిటీ, ఎస్సీ కార్పొరేషన్ పథకాలకు సంబంధించిన 2025-26 ఆర్థిక సంవత్సరం OBBMS ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించిన విషయం తెలిసిందే. కాగా ఈ పథకాల కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఎంపీడీవో దొండ కృపాకర్ పేర్కొన్నారు. మండలానికి మైనారిటీ కార్పొరేషన్ పథకం కింద 3 యూనిట్లు కేటాయించగా, మంగళవారం దరఖాస్తుదారులకు మౌలిక పరీక్ష నిర్వహించి, ధృవపత్రాలను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఇక ఎస్సీ కార్పొరేషన్ పథకానికి సంబంధించి మండల వ్యాప్తంగా 71 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 21 యూనిట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక కోసం బుధవారం(మే 6) ఉదయం 11 గంటలకు ఎండపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులంతా అవసరమైన ధృవపత్రాలతో సమయానికి హాజరుకావాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత సాధించిన వారికి యూనిట్లు మంజూరు చేయనున్నట్లు ఎంపీడీవో స్పష్టం చేశారు.





