నేటి సాక్షి గజ్వేల్ :—-సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పట్టణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆంక్ష రెడ్డి మాట్లాడుతూ… డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడని కొనియాడారు. సమాజంలో ఉన్న అసమానతలు, అణచివేతలను ఎదుర్కొంటూ బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించేందుకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి విలువలను దేశ ప్రజలకు అందించిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు.అంబేద్కర్ ఆశయాలను నేటి యువత ఆచరణలో పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు. విద్యను ఆయుధంగా చేసుకుని ప్రతి ఒక్కరూ అభివృద్ధి సాధించాలని సూచించారు. సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ దళితులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో ఐక్యతను పెంపొందించాలని, వివక్షను నిర్మూలించి సమాన హక్కులతో కూడిన సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని ఆంక్ష రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో ప్రజలు పాల్గొని భోజనం స్వీకరించారు.





