నేటి సాక్షి : మునగాలరేపాల గ్రామంలో బొడ్రాయి పుష్కర వసంత ఉత్సవాలు మంగళవారం అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. తెల్లవారుజాము నుంచే గ్రామమంతా పండుగ శోభతో కళకళలాడగా, భక్తులు భారీగా తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ – నాగమణి దంపతులు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచింది.ఉత్సవాల సందర్భంగా బొడ్రాయికి జలాభిషేకం, కుంకుమాభిషేకం, పుష్పాభిషేకం పాలాభిషేకం, చక్రాభిషేకం వంటి విశేష అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అర్చనలు జరిపి, దేవతను శాస్త్రోక్తంగా ఆరాధించారు. ఈ అభిషేకాల సమయంలో వేద మంత్రోచ్చారణలు మారుమోగి బొడ్రాయి ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతితో నిండిపోయింది.గ్రామ మహిళలు గణనీయ సంఖ్యలో పాల్గొని బొడ్రాయిని పూలతో, అందంగా అలంకరించారు. సంప్రదాయ వస్త్రధారణలో హాజరైన మహిళలు మంగళహారతులు ఇస్తూ భక్తి గీతాలు ఆలపించడంతో ఉత్సవాలకు ప్రత్యేక శోభ చేకూరింది. చిన్నారులు కూడా ఉత్సాహంగా పాల్గొని గ్రామంలో పండుగ సందడిని రెట్టింపు చేశారు.వేద పండితుడు వేదం గురునాధ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. హోమాలు, యజ్ఞాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రజలందరూ కలిసి బొడ్రాయి పుష్కర వసంత ఉత్సవం జరపటం గ్రామ ఐక్యతను చాటుకున్నారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ. బొడ్రాయి పుష్కర వసంత ఉత్సవాల ప్రాముఖ్యతను వివరించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు సంప్రదాయాలను కాపాడుతాయని పేర్కొన్నారు. యువత కూడా నిర్వహణలో చురుకుగా పాల్గొని సేవా కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.మొత్తంగా రేపాల గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి పుష్కర వసంత ఉత్సవాలు భక్తి, ఆనందం, ఐక్యతలకు ప్రతీకగా నిలిచాయి. గ్రామమంతా పండుగ వాతావరణంతో కళకళలాడగా, భక్తుల హర్షధ్వానాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఈ ఉత్సవాలు గ్రామ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచేలా నిర్వహించబడినట్లు గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.





