నేటి సాక్షి, మునగాలశ్రీరాంసాగర్ రెండవ దశ కాల్వపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి రైతాంగానికి పూర్తి స్థాయిలో సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మునగాల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో చందా చంద్రయ్య అధ్యక్షతన జరిగిన రైతు సంఘం మండల మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీరాంసాగర్ ఆయకట్టు ప్రాంతాలకు సక్రమంగా నీరు అందక ఈ వేసవిలో వరి పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా కాల్వ చివరి ప్రాంతాల భూములకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాల్వ పరిధిలోని రైతులకు పంటలు సరిగా పండక ఆర్థికంగా నష్టాలు వాటిల్లుతున్నాయని గుర్తుచేశారు.జిల్లాలో రైతులు పండించిన వరి పంటలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని ఆయన సూచించారు. యూరియా యాప్ అమలుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.రైతు భరోసా పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన ఆయన, రైతులకు సకాలంలో పెట్టుబడి సహాయం అందడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపిస్తూ, గతంలో తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతులు చేసిన ఉద్యమాలను గుర్తు చేశారు. ఆందోళనల నేపథ్యంలో కేంద్రం వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు.అదేవిధంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు భారీగా పెరిగిపోవడంతో రైతులపై ఆర్థిక భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా రోజురోజుకు రైతు పరిస్థితి మరింత దిగజారుతోందని పేర్కొన్నారు. నానాటికీ రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కానీ పరిస్థితి నెలకొంటుందన్నారు. పంటలు పండక మరోవైపు పెట్టుబడులు పెరగడంతో రైతులు ఆత్మహత్యల దిశగా వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 19న నిమ్మికల్ గ్రామంలో జరుగుతున్న జిల్లా రైతు సంఘం మహాసభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం రైతు సంఘం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండల నూతన అధ్యక్షులుగా చందా చంద్రయ్య, కార్యదర్శులుగా దేశి రెడ్డి స్టాలిన్ రెడ్డి ఎన్నికయ్యారని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, షేక్ సైదా, జూలకంటి విజయలక్ష్మి, మెదరమెట్ల వెంకటేశ్వరరావు, గోగిరెడ్డి వెంకటరెడ్డి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు





