నేటి సాక్షి గజ్వేల్…ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటోందని విద్యాశాఖ ఏఎస్ఓ నర్సింలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, నిర్వహణలో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.గజ్వేల్ పట్టణంలోని ఐవసి కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో గజ్వేల్ మండల విద్యాశాఖ అధికారి కృష్ణ నేతృత్వంలో ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఎస్ఓ నర్సింలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నర్సింలు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ విద్యాసంస్థలకంటే మెరుగైన నాణ్యమైన విద్య అందిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫార్ములు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేలా, వారి వ్యక్తిగత నైపుణ్యాలను అభివృద్ధి చేసే విధంగా బోధన కొనసాగుతున్నట్లు చెప్పారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని వివరించారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్ వంటి వసతులు మెరుగుపరిచే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల వైపు మళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా స్థానిక సర్పంచులు, వార్డు సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రజాప్రతినిధులు తమ వంతు సహకారం అందించి బడుల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.ఈ అవగాహన సదస్సులో నియోజకవర్గంలోని వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై పలు సూచనలు చేశారు.ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.





