నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 20వ వార్డు కౌన్సిలర్ టికెట్కు సంబంధించి కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో, వార్డు ప్రజలు నేరుగా రంగంలోకి దిగారు.. సోమవారం 20వ వార్డుకు చెందిన ప్రజలు కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావును మర్యాదపూర్వకంగా కలిశారు. నామినేషన్ దాఖలు చేసిన గంధం గంగాధర్కే పార్టీ టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. టికెట్ విషయంలో స్పష్టత లేకపోవడంతో పార్టీ శ్రేణులు, ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.*కుల పెద్దలు, మహిళలు, యువతతో బలమైన మద్దతు*ఈ సమావేశంలో వార్డు కుల పెద్దలు, సుమారు 50 మంది మహిళలు, 70 మంది యువకులు పాల్గొని గంధం గంగాధర్ గతంలో వార్డు అభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవను గుర్తు చేస్తూ, ప్రజల్లో ఆయనకు బలమైన ఆదరణ ఉందని తెలిపారు. పార్టీ టికెట్ గంధం గంగాధర్కు ఇస్తే, అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఇన్చార్జి ఎదుట స్పష్టంగా హామీ ఇచ్చారు.*టికెట్ గందరగోళం పార్టీకే నష్టమన్న అభిప్రాయం*నామినేషన్ వేసిన అభ్యర్థికి కాకుండా వేరే అభ్యర్థికి బీ–ఫాం ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం పార్టీకి నష్టం కలిగిస్తుందన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు ఉన్న అభ్యర్థిని పక్కన పెట్టడం వల్ల కార్యకర్తల్లో నిరుత్సాహం పెరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుని స్పష్టత ఇవ్వకపోతే, కోరుట్ల 20వ వార్డులో రాజకీయ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.______





