సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని బెల్లంపల్లి మండల కేంద్రంలో గల షెడ్యూల్డ్ కులాల సమీకృత బాలికల వసతి గృహంలో అస్వస్థతకు గురై మండల కేంద్రంలోని ప్రభుత్వ కెమికల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు. అనంతరం వసతి గృహ భవనాన్ని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, జిల్లా షెడ్యూలు కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్ లతో కలిసి సందర్శించి వసతి గృహ వార్డులు, వంటశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మధ్యాహ్నం భోజనంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తుందని తెలిపారు. శుక్రవారం రాత్రి భోజనం అనంతరం 16 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించడం జరిగిందని, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థినులు పూర్తిగా కోలుకున్నారని, శనివారం సాయంత్రం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేస్తారని తెలిపారు. ఈ చర్య పై వసతి గృహ సంక్షేమ అధికారి సుజాత కు షోకాజ్ నోటీస్ జారీ చేయడం జరిగిందని, వివరణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు





