నేటి సాక్షి గజ్వేల్: ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం గ్రామంలోని ప్రతి ఇంటికి చేరేలా సర్పంచులు కృషి చేయాలని కొన్యాల బాల్ రెడ్డి పిలుపునిచ్చారు.రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన సర్పంచుల సమావేశంలో కొన్యాల బాల్ రెడ్డిని సిద్దిపేట జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే కార్యక్రమంలో వెంకన్న గారి వెంకట్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గ సర్పంచుల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా కొన్యాల బాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు నియోజకవర్గ, జిల్లా స్థాయిలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా గ్రామాభివృద్ధిలో ముందుండి పనిచేస్తామని చెప్పారు.ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు గడపగడపకు చేరేలా ప్రతి సర్పంచ్ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో తడి, పొడి చెత్త నిర్వహణతో పాటు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులను సమర్థవంతంగా వినియోగించి అసంపూర్తి పనులను పూర్తి చేయాలని కోరారు.జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు జిల్లాలోని సర్పంచులకు కొన్యాల బాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయిని యాదగిరి, గుంటుకు శ్రీనివాస్, నక్క రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





