నేటి సాక్షి గజ్వేల్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రశేఖర్ రావు ను శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం – నాచారం గుట్ట ప్రతినిధులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ప్రతాప్ రెడ్డి తో కలిసి ఆలయ ప్రతినిధులు కేసీఆర్ను కలిసి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించారు.ఈ నెల 8వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ చైర్మన్ రవీందర్, ఈఓ రంగాచారి, ఆలయ అర్చకులు కేసీఆర్కు అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రసాదాన్ని సమర్పించి బ్రహ్మోత్సవాలకు విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు.ఆలయ అర్చకులు వేదమంత్రాల మధ్య కేసీఆర్కు ఆశీర్వాదాలు అందజేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, ధ్వజారోహణం, వాహన సేవలు, కల్యాణోత్సవం వంటి పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం పొందేలా ఏర్పాట్లు చేస్తున్నామని కెసిఆర్ కు వివరించారు . బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని ఆలయ ప్రతినిధులు వెల్లడించారు.బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పెంచే మహోత్సవాలుగా జరుగుతాయని, ఈసారి కూడా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరారు.





