నేటిసాక్షి, మిర్యాలగూడ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా మార్చి 6 నుండి ప్రారంభమై జూన్ 12 వరకు 99 రోజుల పాటు అమల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని శుక్రవారం పట్టణంలోని కెఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ మల్గిరెడ్డి భీమార్జున రెడ్డి, నోడల్ అధికారి పి. నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ భీమార్జున రెడ్ది మాట్లాడుతూ, మొదటి 10రోజుల పాటు మర్చి 6 నుండి 15 వరకు ప్రణాళికను తయారు చేసుకొని, కమిటీల ద్వారా కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలియజేశారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విధానాలు ప్రజలకు చేరువ కావడంతో పాటు కళాశాలలు, విద్యాసంస్థల్లో సేవలను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, శుభ్రతా కార్యక్రమాలను నిర్వహించడం, పెండింగ్ ఫైల్స్, పరిపాలనా పనులను త్వరగా పూర్తి చేయడం, కళాశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేసి విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్.సి.సి. మరియు ఎన్.ఎస్.ఎస్. విద్యార్థులు కళాశాల ఆవరణను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారులు శ్రీనివారావు, స్వప్న , ఎన్.సి.సి. సి.టి.ఒ. నరేష్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.





