నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి మార్చి 6చౌడేపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానంలో వివిధ లైసెన్స్ హక్కుల కేటాయింపునకు దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ వేలం రెండో రోజు కూడా ప్రశాంత వాతావరణంలో జరిగింది. గురువారం దేవస్థానం కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ వేలానికి భక్తులు, వ్యాపారులు, డిపాజిట్ దారులు పెద్ద సంఖ్యలో హాజరై పోటీగా పాల్గొన్నారు.ఈ వేలం ద్వారా దేవస్థానానికి మొత్తం రూ.24,21,000 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ, ఉప కమిషనర్ జె. ఏకాంబరం తెలిపారు. ప్రతి లైసెన్స్ హక్కుకు పోటీగా బిడ్లు పడటంతో వేలం ఉత్సాహభరితంగా సాగిందన్నారు.దేవస్థానం పరిసర ప్రాంతాలలో అమ్మవారికి భక్తులు సమర్పించే కొబ్బరికాయల పైచిప్పలను సేకరించుకునే హక్కును కె. మల్లికార్జున రూ.7,70,000లకు దక్కించుకున్నారు. దేవస్థానం పరిసర ప్రాంతంలో స్టీల్, రాగి, ఇత్తడి ప్లేట్లు, జోతులు, హారతి పళ్లెం వంటి పూజా సామగ్రి విక్రయించే హక్కును సోము రూ.90,000లకు పొందారు.అలాగే కొండ కింద కోళ్ల విక్రయ హక్కును ఆర్. పవన్ రూ.7,00,000లకు సొంతం చేసుకున్నారు. భక్తులకు అవసరమైన పేపర్ కవర్లు, బ్యాగులు విక్రయించే హక్కును సి. గజేంద్ర రూ.6,70,000లకు కైవసం చేసుకున్నారు.దేవస్థానంలో ఫోటోలు తీసుకునే హక్కుకు జరిగిన వేలంలో కిరణ్ రూ.1,91,000కు హెచ్చుపాటుగా బిడ్ వేయడంతో ఆ హక్కును పొందారు.ఇంకా కొన్ని లైసెన్స్ హక్కులకు ఎవరూ హాజరుకాకపోవడంతో ఆ హక్కుల వేలాన్ని తరువాతి తేదీకి వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ, ఉప కమిషనర్ జె. ఏకాంబరం, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, ఆలయ ప్రధాన అర్చకులు గంగిరెడ్డి, సుధాకర్, చౌడేపల్లి సబ్ఇన్స్పెక్టర్ చిన్నరెడ్డెప్ప, పోలీస్ సిబ్బంది, ఆలయ అధికారులు, అర్చక సిబ్బంది, డిపాజిట్ దారులు తదితరులు పాల్గొన్నారు.





