నేటి సాక్షి గజ్వేల్:—గజ్వేల్: యుద్ధ పరిస్థితులను సాకుగా చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను పెంచే ప్రయత్నాలు చేయకూడదని సిపిఐ గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగం కృష్ణ ఘాటుగా విమర్శించారు. సాధారణ ప్రజలపై అదనపు భారాన్ని మోపే విధానాలను తక్షణమే విరమించాలని ఆయన డిమాండ్ చేశారు.భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగం కృష్ణ మాట్లాడుతూ, అంతర్జాతీయ యుద్ధాలను కారణంగా చూపి దేశంలోని సామాన్య ప్రజలపై భారాన్ని మోపడం కేంద్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, గ్యాస్ ధరలు పెంచడం ప్రజలపై మరింత దెబ్బ అవుతుందని అన్నారు.సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు స్వర్గం రాజేశం మాట్లాడుతూ, అమెరికా సామ్రాజ్యవాద చర్యలను తీవ్రంగా ఖండించారు. ఇరాన్పై ఆధిపత్యం సాధించాలనే ఉద్దేశంతో జరుగుతున్న యుద్ధ చర్యలు ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తున్నాయని అన్నారు. అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ ఇరాన్పై జరుపుతున్న దాడుల వల్ల ప్రపంచంలోని కీలక ఆయిల్ నిల్వలు ప్రమాదంలో పడుతున్నాయని, దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని దేశంలో గ్యాస్ కొరత రాకుండా చూడాలని, ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సిపిఐ డిమాండ్ చేసింది. దేశ ప్రధానమంత్రి అమెరికాపై ఒత్తిడి తీసుకువచ్చి యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించాలని కూడా వారు కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి మొట్ట శ్రీను, గజ్వేల్ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు టంప చంద్రం శీను, సిపిఐ నాయకులు పోతుల శంకరయ్య, నర్సింలు, రాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.





