Tuesday, April 21, 2026

గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌లో చెత్త కుప్పలు.. ప్రజల అవస్థలు..!వారానికి ఒక్కసారే సేకరణ.. దుర్వాసనతో ప్రజల ఆగ్రహంపనిచేయని వాహనాలు.. నిలిచిపోయిన వర్గీకరణ వ్యవస్థప్రైవేట్ ఏజెన్సీలతో మున్సిపాలిటీకి ఆదాయం గండం..

? నేటి సాక్షి గజ్వేల్:—సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో క్రమబద్ధంగా కొనసాగిన ఇంటింటి చెత్త సేకరణ ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారడంతో కాలనీల్లో చెత్త కుప్పలు పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ప్రస్తుతం ప్రతి ఇంటి నుంచి వారానికి ఒక్కసారి మాత్రమే చెత్త సేకరిస్తుండటంతో ఇంటి ముందు చెత్త నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లు, బస్తీలు, స్లమ్ ప్రాంతాల్లో చెత్త ఎక్కువగా పేరుకుపోతుండటంతో వీధుల్లో కుక్కలు, పందులు తిరుగుతూ చెత్తను చిందరవందర చేస్తుండటంతో దృశ్యం మరింత దారుణంగా మారుతోంది.*కాలనీల్లో దుర్వాసన.. దోమల బెడద.. ఆరోగ్య భయం*చెత్త సమయానికి తీసుకెళ్లకపోవడంతో పలు కాలనీల్లో తీవ్రమైన దుర్వాసన వస్తోందని, దోమలు విపరీతంగా పెరిగి మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాల ముప్పు పొంచి ఉందని ప్రజలు భయపడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.కొన్ని ప్రాంతాల్లో చెత్త సేకరణ వాహనాలు రాకపోవడంతో ప్రజలు కాలనీ మూలల్లో లేదా ఖాళీ స్థలాల్లో చెత్త వేయాల్సి వస్తోందని, దీని వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారి పర్యావరణానికి కూడా నష్టం జరుగుతోందని విమర్శిస్తున్నారు.*గతంలో బాగున్న వ్యవస్థ.. ఇప్పుడు పూర్తిగా నిలిచిపోయిందా?*గత పాలకవర్గం సమయంలో రెండు రోజులకోసారి ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలించేవారని ప్రజలు గుర్తుచేస్తున్నారు. అక్కడే చెత్తను వర్గీకరించి రీసైక్లింగ్ చేసే విధానం ఉండేదని, దీంతో మున్సిపాలిటీకి కొంత ఆదాయం కూడా సమకూరేదని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం చెత్త వర్గీకరణ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయి, తడి-పొడి చెత్త కలగలిపి పడేస్తుండటంతో రీసైక్లింగ్ అవకాశాలు కోల్పోతున్నామని ఆరోపిస్తున్నారు.*13 ఆటోలు, 12 ట్రాక్టర్లు ఉన్నా.. సగం కూడా పనిచేయడం లేదా?*మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ కోసం 13 ఆటోలు, 12 ట్రాక్టర్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం వీటిలో సగం వాహనాలు కూడా రోడ్లపైకి రావడం లేదని సమాచారం. వాహనాలు పనిచేయకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు సిబ్బంది కాలినడకన వెళ్లి ప్రజలను చెత్త బయట పెట్టాలని చెప్పాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు.అలాగే కొన్ని చోట్ల వాహనాలు ఉన్నా డీజిల్, నిర్వహణ ఖర్చులు సక్రమంగా అందకపోవడంతో వాహనాలు నిలిచిపోతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.*ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తే ఆదాయం తగ్గే ప్రమాదం*ఇక చెత్త సేకరణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ప్రైవేట్ ఏజెన్సీలకు చెత్త సేకరణ ఇస్తే మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం తగ్గిపోయే ప్రమాదం ఉందని, ముఖ్యంగా రీసైక్లింగ్ ద్వారా వచ్చే ఆదాయం కూడా పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లే అవకాశముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చెత్త వర్గీకరణ చేసి ప్లాస్టిక్, కార్డ్‌బోర్డ్, ఐరన్ వంటి వ్యర్థాలను విక్రయిస్తే మున్సిపల్ శాఖకు ఆదాయం పెరిగే అవకాశం ఉందని, అదే విధంగా కంపోస్టు తయారు చేసి రైతులకు విక్రయిస్తే మరింత ఆదాయం సమకూరుతుందని స్థానికులు సూచిస్తున్నారు.*ప్రజల డిమాండ్ ఇదే..*చెత్త సమస్య తీవ్రతరం కాకముందే అధికారులు వెంటనే స్పందించి, పనిచేయని వాహనాలను రిపేర్ చేయించి రోజువారీగా లేదా కనీసం రెండు రోజులకోసారి చెత్త సేకరణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే తడి-పొడి చెత్త వర్గీకరణను మళ్లీ పునరుద్ధరించి రీసైక్లింగ్, కంపోస్టింగ్ ద్వారా మున్సిపల్ శాఖకు ఆదాయం వచ్చే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరుతున్నారు.ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలోనే చెత్త సేకరణ జరగాలని, అప్పుడు ప్రజలకు మెరుగైన సేవలు అందడంతో పాటు మున్సిపాలిటీకి కూడా ఆదాయం పెరుగుతుందని పట్టణవాసులు అభిప్రాయపడుతున్నారు.గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పట్టణం అభివృద్ధి పథంలో సాగాలంటే ముందుగా ప్రాథమిక సమస్య అయిన చెత్త సేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News