నేటి సాక్షి వికారాబాద్ :వికారాబాద్ జిల్లా లో వార్షిక మొబిలైజేషన్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో కొత్రేపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఫైరింగ్ ప్రాక్టీస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ క్షేత్రస్థాయిలో ఆయుధాల పనితీరును పరిశీలిస్తూ, వివిధ రకాల తుపాకులతో స్వయంగా ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు.పోలీసు సిబ్బందికి ఆయుధ వినియోగంలో ఖచ్చితత్వం, వేగం, సమన్వయం ఎంత ముఖ్యమో వివరించిన ఎస్పీ , ఫైరింగ్ సమయంలో అనుసరించాల్సిన భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో, ఒత్తిడిలో కూడా సమర్థవంతంగా స్పందించేందుకు ఇటువంటి శిక్షణలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు అధికారులు సిబ్బంది తమ వృత్తిపరమైన నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆయుధాల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండటం ప్రతి పోలీసు సిబ్బందికి అవసరమని పేర్కొన్నారు. ప్రజల భద్రతే పోలీసుల ముఖ్య లక్ష్యం కావడంతో, ఎప్పటికప్పుడు తమ సామర్థ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.వార్షిక మొబిలైజేషన్ శిక్షణల ద్వారా సిబ్బంది శారీరక ధారుడ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు మానసిక ధైర్యం, క్రమశిక్షణ, సమయపాలన వంటి లక్షణాలు అభివృద్ధి చెందుతాయని ఎస్పీ గారు తెలిపారు. పోలీసు విభాగం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ ఫైరింగ్ ప్రాక్టీస్ కార్యక్రమంలో జిల్లా ఏఆర్ డిఎస్పీ వీరేష్, ఆర్ఐ నాగరాజు, శ్రీశైలం, ఆర్ఎస్ఐలు, వివిధ యూనిట్లకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





