నేటి సాక్షి న్యూస్ ఏప్రిల్ 25 పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. గత 20 రోజులుగా గ్రామంలో మంచినీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి కాలం ప్రారంభం నుంచే తాగునీటి కష్టాలు మొదలయ్యాయని, ప్రస్తుతం బురద నీళ్లే ఆధారంగా మారడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.గ్రామంలో ఉన్న చేతి బోరింగ్లు సరిపడ నీరు ఇవ్వకపోవడంతో పరిస్థితి మరింత విషమంగా మారింది. కొన్ని కాలనీల్లో పూర్తిగా నీటి కొరత నెలకొనడంతో ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. తాగునీటి కొరత కారణంగా గ్రామంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అధికారుల నిర్లక్ష్యంపై వ్యవసాయ కార్మిక సంఘం నేత తిక్కన్న తీవ్రంగా స్పందిస్తూ, సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. జిల్లా స్థాయి అధికారుల సూచనలు ఉన్నప్పటికీ స్థానిక అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని విమర్శించారు.తక్షణమే తాగునీటి సరఫరా పునరుద్ధరించి గ్రామ ప్రజలకు ఉపశమనం కల్పించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలకు దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.





